నిధులివ్వకపోవడంతో రెంట్లతో నడుపుకున్నరు
నల్గొండ : నల్గొండ జిల్లా పరిషత్ పాలకవర్గం ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో సొంత ఆస్తులనే లీజుకు ఇచ్చి ఐదేండ్లు ఎల్లదీసింది. డబ్బులు లేక స్వాతంత్ర్య దినోత్సవాన్ని, తెలంగాణ ఆవిర్భావ వేడుకులను కూడా ఘనంగా నిర్వహించుకోలేని పరిస్థితి ఉండేది. దీంతో మెయింటనెన్స్ కోసం కొత్త జడ్పీ బిల్డింగ్కట్టాక పాత బిల్డింగ్ను ఆడిట్, ఆబ్కారీ, క్వాలిటీ కంట్రోల్, పోక్సో కోర్టు, బీఎల్ఐసీ ఆఫీసులకు రెంట్కు ఇవ్వాల్సి వచ్చింది. ఇందులోనూ కోర్టు నుంచి మాత్రమే నెలకు ఠంచన్గా రూ.9వేలు రెంట్వస్తోంది. మరొక రెండు శాఖలు అరొకరగానే అద్దె చెల్లించేవి.
దీంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేషనరీ ఖర్చులు కూడా ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. చివరకు జడ్పీటీసీలు, చైర్మన్ కోసం నిర్మించిన గెస్ట్ హౌస్ను లీజుకు ఇచ్చింది. ఇదే గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న జాగను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ఇలా గత మూడేండ్ల నుంచి పత్రి నెలా వచ్చే రూ.70 వేలతో జడ్పీని నెట్టుకువచ్చారు. ఈ డబ్బులతోనే స్టేషనరీ ఖర్చులు, జనరల్ బాడీ, స్టాండింగ్ కమిటీ మీటింగులు జరిగినప్పుడు స్నాక్స్, టీలు, టిఫిన్లు పెట్టేవారు. మూడు నెలలకోసారి నిర్వహించే జనరల్బాడీ మీటింగులకు భోజన ఖర్చులు తడిసి మోపెడైనా ఇదే డబ్బులతో సర్దుబాటు చేశారు.
10 కోట్లు ఇస్తామన్న కేసీఆర్
నిధులు బాగా ఖర్చు చేసే జడ్పీలకు అదనంగా రూ.10 కోట్ల నిధులు ఇస్తామని అప్పటి సీఎం సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీని సంగతి పక్కన పెడితే అసలు జడ్పీకి రావాల్సిన గ్రాంట్లన్నీ అప్పటి జిల్లా మంత్రి గుప్పిట్లోనే పెట్టుకున్నారు. డీఎంఎఫ్టీ, ఉపాధి నిధులన్నీ మంత్రి కోటాలోకే మళ్లించారు. ఎస్ఎఫ్సీ, సీనరేజ్, జనరల్ ఫండ్ గ్రాంట్లు ఇవ్వడం బంద్ చేశారు. కేంద్రం రిలీజ్ చేసిన15 వ ఆర్ధిక సంఘం నిధులు తప్పా జడ్పీకి నయాపైసా రాలేదు. ఐదేండ్లలో ఒక్కో జడ్పీటీసీకి సగటున
రూ.కోటికి మించి ఫండ్స్ రాలేదు. రెండేండ్లలో వచ్చింది కేవలం రూ.10 కోట్లు మాత్రమే. గతేడాది నవంబర్ నుంచి జడ్పీటీసీలకు ఇవ్వాల్సిన జీతాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసింది.
©️ VIL Media Pvt Ltd. 2024-07-03T02:03:07Z dg43tfdfdgfd