HYDERABAD BIRYANI | హైదరాబాద్‌ పేరు ప్రఖ్యాతలను మూసీలో కలిపేస్తున్నారు.. బిర్యానీలో మసాలా ప్లాస్టిక్‌ పీస్‌

Hyderabad Biryani | సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): బిర్యానీలో హైదరాబాద్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతలన్నీ మూసీలో కలిపేస్తున్నారు. ఇన్నాళ్లు మురిగిపోయినా, పురుగులు పట్టిన మాంసంతో బిర్యానీని వండి వార్చిన హోటల్‌ నిర్వాహకులు.. ఇంకా శృతి మించినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏదోఒక హోటల్‌ నిర్వాహకులు తప్పులు చేస్తూ దొరికిపోతున్నారు. తాజాగా.. మణికొండకు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్‌ చేయగా.. మసాలా దట్టించిన చికెన్‌ పీస్‌తో పాటు, బాగా ఉడికిన, ధమ్‌ ప్లాస్టిక్‌ కవర్‌ను కూడా అదనంగా చేర్చి కస్టమర్‌కు అందించారు.

మణికొండకు సమీపంలో ఉండే మెహిఫిల్‌ రెస్టారెంట్‌లో ఈ రుచికరమైన మసాలా ప్లాస్టిక్‌ బిర్యానీని చూసి బిత్తరపోయిన ఆ కస్టమర్‌ సోషల్‌ మీడియాలో ఫొటోతో సహా పంచుకున్నాడు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో పాటు, డెలివరీ చేసిన స్విగ్గీ సంస్థను ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో వేయగానే.. నోరూరించే బిర్యానీని చూసి నెటిజన్లు, బిర్యానీ లవర్లు విరుచుకుపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కస్టమర్‌ కోరుతున్నా.. అధికారుల ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నట్లుగానే ఉన్నారు. కానీ, డెలివరీ చేసిన స్విగ్గీ మాత్రం జరిగిన తప్పిదానికి కస్టమర్‌ను ప్రసన్నం చేసుకునేలా సమాధానం ఇచ్చి.. ప్లాస్టిక్‌ బిర్యానీపై క్షమాపణలు చెప్పింది.

2024-07-01T23:10:05Z dg43tfdfdgfd